ప్రతి సోమవారం మండల స్థాయి అధికారుల సమక్షంలో అర్జీల స్వీకరణ.
సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీడీవో క్రాంతి కుమార్
మల్హర్ , ఆగస్టు 15 (చక్రవాణి న్యూస్) :
మండల కేంద్రమైన తాడిచర్లలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 17వ తేదీ (సోమవారం) నుంచి ప్రతి వారం మండల స్థాయి 'ప్రజావాణి' (సమస్యల పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని నిరంతరాయంగా నిర్వహించనున్నట్లు ఎంపీడీవో క్రాంతి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వం జారీ చేసిన నూతన ఉత్తర్వుల ప్రకారం.. ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించేందుకు ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు పరిషత్ కార్యాలయంలో అర్జీలను స్వీకరిస్తామన్నారు. మండల పరిధిలోని సమస్త శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై, ప్రజల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలపై విజ్ఞప్తులు సమర్పించాలని ఎంపీడీవో కోరారు.


0 Comments