భూపాలపల్లి కలెక్టర్కు ఆదేశాలు జారీ చేస్తామని హెచ్ఆర్సీ హామీ
భూ నిర్వాసితుల హక్కుల సాధన కమిటీ అధ్యక్షులు కేసారపు రవి
మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్ల, కాపురం గ్రామాల డెంజర్ జోన్లో నివసిస్తున్న భూనిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతూ తాడిచెర్ల-కాపురం గ్రామాల భూ నిర్వాసిత హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షులు కేసరపు రవి తదితరులు తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్లో దాఖలు చేసిన కేసు నం. 4871/2025 బుధవారం విచారణకు వచ్చింది.హైదరాబాద్లోని తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ కోర్ట్ హాల్-3లో గౌరవ సభ్యులు (నాన్-జ్యుడీషియల్) డా. బి. కిషోర్, IAS (రిటైర్డ్) ఆధ్వర్యంలోని సింగిల్ బెంచ్ ఎదుట ఈ కేసు విచారణ జరిగింది. కమిషన్ విడుదల చేసిన విచారణ జాబితాలో ఈ కేసు సీరియల్ నం. 37గా నమోదైంది.ఈ కేసులో తెలంగాణ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ప్రతివాదులుగా ఉన్నారు. డెంజర్ జోన్లో నివసిస్తున్న ప్రజల ప్రాణ భద్రత, మానవ హక్కుల పరిరక్షణ, సురక్షిత ప్రాంతాలకు పునరావాసం కల్పించాలని పిటిషనర్లు కమిషన్ను కోరారు.విచారణ సందర్భంగా భూనిర్వాసితుల కమిటీ అధ్యక్షులు కేసరపు రవి కమిషన్ ఎదుట హాజరై డెంజర్ జోన్లో నివసిస్తున్న కుటుంబాలు ఎదుర్కొంటున్న ప్రమాద పరిస్థితులు, భద్రతా సమస్యలను వివరించారు.విచారణ అనంతరం గౌరవ సభ్యులు డా. బి. కిషోర్ తనతో మాట్లాడుతూ, డెంజర్ జోన్లో నివసిస్తున్న నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై జిల్లా కలెక్టర్కు తగిన ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు కేసరపు రవి వెల్లడించారు. నిర్వాసితుల ప్రాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కమిషన్ అభిప్రాయపడినట్లు ఆయన తెలిపారు.డెంజర్ జోన్లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి శాశ్వత పునరావాసం కల్పించి, వారి ప్రాణ, ఆస్తి భద్రతను ప్రభుత్వం తక్షణమే నిర్ధారించాలని భూ నిర్వాసిత హక్కుల సాధన పోరాట కమిటీ అధ్యక్షులు కేసరపు రవి విజ్ఞప్తి చేశారు.

0 Comments