170 మీటర్ల లోతులో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసిన రెస్క్యూ బృందాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 04 (చక్రవాణి న్యూస్) :
నేపాల్లో సంభవించిన ఘోర వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో అద్భుత పరిణామం చోటుచేసుకుంది. ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరదలు, మంచు, రాళ్లు, బురద ప్రవాహం కారణంగా అప్పర్ త్రిశూలి-3A జలవిద్యుత్ ప్రాజెక్టు టన్నెల్లో చిక్కుకుపోయిన ఇద్దరు కార్మికులను 9 రోజుల తర్వాత సజీవంగా రక్షించారు.రెస్క్యూ బృందాలు టన్నెల్లో సుమారు 170 మీటర్ల లోతులో చిక్కుకున్న సంజయ్ సాహ్ (30), కబీర్ మహార్జన్ (45)లను శుక్రవారం సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. సంజయ్ సాహ్ మెకానికల్ ఫోర్మన్గా, కబీర్ మహార్జన్ మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నారు.వరదలు వచ్చిన సమయంలో సంజయ్ సాహ్ కంట్రోల్ రూమ్లో ఉన్నారు. ఇతర కార్మికులు బయటకు వెళ్లేందుకు సహాయం చేస్తూ తాను ఆలస్యంగా బయటకు వెళ్లడంతో టన్నెల్లో చిక్కుకున్నట్లు తెలిపారు. టన్నెల్లో చిక్కుకున్న సమయంలో చీకటిలో మంత్రాలను జపిస్తూ ధైర్యంగా ఉన్నట్లు వెల్లడించారు.టన్నెల్ లోపలి నుంచి మనుషుల గొంతులు వినిపించడంతో రెస్క్యూ బృందాల్లో ఆశలు చిగురించాయి. దీంతో సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు. టన్నెల్లో ఇంకా పలువురు సజీవంగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇద్దరు కార్మికులు ప్రాణాలతో బయటపడటం మిగతా వారిని కూడా రక్షించవచ్చనే ఆశలను పెంచింది.రక్షించిన ఇద్దరినీ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలిస్తున్నారు. కబీర్ మహార్జన్ చేతులు, కాళ్లు కదపలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం కాగా, సంజయ్ సాహ్కు ఎలాంటి గాయాలు లేవని అధికారులు తెలిపారు.నేపాల్లో ఆగస్టు 26న సంభవించిన ఈ ప్రకృతి విపత్తు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. అయితే 9 రోజుల తర్వాత ఇద్దరు కార్మికులు సజీవంగా బయటపడటం ‘మిరాకిల్ రెస్క్యూ’గా నిలిచింది.


0 Comments